-
ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం
-
ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అంచనా
-
లానినొ పరిస్థితులే భారీ వర్షాలకు కారణంగా వెల్లడి
ముఖ్య వాతావరణ హెచ్చరిక: రేపు (అక్టోబర్ 16న) ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్ను చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు ధృవీకరించారు. సమయంకంటే ముందే ఆగమనం నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చి, త్వరగానే తిరుగుముఖం పట్టడంతో, ఈశాన్య రుతుపవనాల రాకకు మార్గం సుగమమైంది. నైరుతి వర్షాల కారణంగా తడిసిన నేల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఈ కొత్త వాతావరణ మార్పు వార్త వచ్చింది.
సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనా: కారణం ‘లానినొ’ ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘లానినొ’ పరిస్థితులే ఈ అదనపు వర్షపాతానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రుతుపవనాల ప్రభావం కొనసాగుతుంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ముప్పు రాబోయే వర్షాలకు తోడు, అక్టోబర్ 22 లేదా 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఏర్పడితే, ఈశాన్య రుతుపవనాలు మరింత చురుగ్గా మారి, వర్షాల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది.
తుపానులకు అనువైన పరిస్థితులు! అక్టోబర్ మరియు నవంబర్ నెలలు బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడటానికి అత్యంత అనుకూలమైనవిగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే అల్పపీడనం బలపడితే అది తుపానుగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడు తీరాలను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. కొత్త రుతుపవనాల రాకతో వర్షపాతం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నైరుతితో దెబ్బతిన్న ఖరీఫ్: రైతన్నల్లో ఆందోళన ఇటీవల ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో దాదాపు సాధారణ వర్షపాతమే (515 మి.మీలకు గాను 530.9 మి.మీ) నమోదైనప్పటికీ, వర్షాల పంపిణీలో సమతుల్యత లోపించింది. జూన్, జులైలలో తక్కువ వర్షాలు, ఆగస్టు, సెప్టెంబర్లలో కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం, తెగుళ్లు సోకడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు కూడా అధిక వర్షాలను మోసుకొస్తుండటంతో, అన్నదాతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
Read also : Modi : ప్రధాని మోదీ పర్యటన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పాఠశాలలకు రెండు రోజుల సెలవులు; భారీ ట్రాఫిక్ ఆంక్షలు
